pratilipi-logo ప్రతిలిపి
తెలుగు
గంటి భానుమతి
16 జనవరి 2018

ఆ యిద్దరు

రచన; గంటి భానుమతి

గంటిభానుమతి గారు నాకు రచయిత్రి కన్నెగంటి అనసూయ ఇంట్లో ఒక గెట్ టుగెదర్ లో కలిసారు.  మా పరిచయము కూడా నాకు చాలా ఎక్సైటింగ్ గా జరిగింది.  జి. యస్.  లక్ష్మిగారు నన్ను భానుమతిగారికి పరిచయము చేసారు మాలాకుమార్ అని .  మీ కథనేనా " నీ జతగా నేనుంటాను. " ఈ నెల రచనలో వచ్చింది. దానికి కథాపీఠం పురస్కారం కూడా వచ్చింది కదా అని చెప్పి పక్కకు వెళ్ళి కూర్చున్నారు.  . ఆవిడ ఎవరండి నేను లక్ష్మిగారిని అడుగుతే గంటిభానుమతి గారు అని చెప్పారు.  ఆవిడ కథలు చదివాను,   భానుమతిగారి కథలకు ప్రతి సంవత్సరమూ రెండో మూడో బహుమతులు వస్తుంటాయి.  దాదాపు ప్రతి పత్రిక లోనూ రెగ్యులర్గా ఆవిడ పేరు కనిపిస్తూ ఉంటుంది.  అలా ఆవిడ రచయిత్రిగా తెలుసు కాని  ఆవిడ తెలియదు. అలా ఒక ప్రముఖ రచయిత్రిని కలుసుకోవటమే కాదు ,  ఆమె ద్వారా  నా కథ రచనలో వచ్చిందని,  దానికి పురస్కారం కూడా వచ్చింది అని తెలిసింది. అది నా మొదటి కథ కూడా కావటము తో నేను చాలా ఎక్సైట్ అయ్యాను.

ఈ మధ్య భానుమతిగారు వ్రాసిన "ఆ యిద్దరు" నవల చదివాను .

“అమ్మంటే ప్రేమకు రూపం “

గంటిభానుమతి గారి "ఆ ఇద్దరు నవల చదవగానే నాకు ఈ పాట గుర్తొచ్చింది.  ఆ నవల ఇద్దరు ఇల్లాళ్ళు ,  సౌదీ అరేబియాలో ఒక ఇంట్లో పనిచేసేందుకు వచ్చిన మాధవి,  ఆమె యజమానురాలు గరిమ ల జీవితమే ఈ నవల.  ఇద్దరూ ఇంచుమించు ఒకే రకమైన పరిస్తితులల్లో ఉంటారు. వారి జీవన శైలి వేరేమో కాని ,  అనుభవాలు మటుకు ఒకటే.  ఇద్దరూ భర్తా బాధితులే! గరిమ ఏయిర్ హోస్టెస్ గా ఉండగా అవినాశ్ విమానం లో ప్రయాణము చేస్తూ ఆమెను చూసి ప్రేమించి ,  వెంటబడి పెళ్ళి చేసుకుంటాడు. పెళ్ళి తరువాత అతనికి ఇదివరకే పెళ్ళైందని,  ఇద్దరు పిల్లలని,  అతను చాలా కోపిష్టి అని తెలుసుతుంది.  ఐనా రాజీ పడిపోయి ,  అతని తోనే ఉంటుంది.  మాధవి ఇంటిమీద అప్పు తీర్చేందుకు ,  పిల్లల కోసం అని భర్త రాజారావు బలవంతం మీద సౌదీ లోని గరిమ ఇంటి కి పని మనిషిగా వస్తుంది.  రాజారావు మాధవి సౌదీ వచ్చాక ఇంకో పెళ్ళి చేసుకొని ,  మాధవి పంపే డబ్బును ఎంజాయ్ చేస్తూ ఉంటాదు.  ఇద్దరి పరిస్తితులూ ఒకటే.  ఆ యిద్దరు అందులో నుంచి ఎలా బయటపడి తమ జీవితాలను చక్కదిద్దుకున్నారన్నది ,  కథలో వివిధ మలుపుల తరువాత తెలుస్తుంది.

ఈ నెల నేను మీకు పరిచయము చేయబోయేది ,  "ఆ యిద్దరు" నవలారచయిత్రి గంటిభానుమతి గారిని.

భానుమతి గారూ నమస్కారమండి

  1. ముందుగా మీ గురించి చెప్పగలరా అంటే మీ విధ్యాబ్యాసము ,  మీ కుటుంబ నేపధ్యము గురించి. . మీకు సాహిత్యము లో అభిరుచి ఎలా కలిగింది? ఎప్పటి నుంచి రాస్తున్నారు?

నేను పుట్టింది , పెరిగింది , చదువుకున్నది అంతా హైదరాబాదు.

పుస్తకాలు చూడడం ,  చదవడం అన్నది చాలా చిన్నప్పుడే మొదలైంది. మా అమ్మ ప్రభ, పత్రిక తనకోసం తెప్పించుకునేది. ఎదురుగా కనిపించే ఆ ఆ పుస్తకాలని మొదట్లో పేజీలు తిప్పుతూ బొమ్మలు మాత్రం చూసేదాన్ని.  , తరవాత కూడబలుక్కుని చిన్న చిన్న జోకులు,  ఆ తరవాత సినిమా కబుర్లూ . కథలూ,  సీరియల్స్ , నవలలూ చదువతూ, ఇలా అంచెలంచెలుగా  పఠనంలో మెట్లు ఎక్కుతూ వచ్చాను. అంతే కాకుండా మా ఇంట్లో ఇంగ్లీషు , తెలుగూ పుస్తకాలుండేవి. అంతే కాకుండా అమ్మకోసం మా ఇంటికి దగ్గర్లో ఉన్న శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయం నుంచి క్లాసిక్ నవలలు తెచ్చేవాళ్ళం, అవి ముందు విసుగనిపించినా మెల్లి మెల్లిగా చదివే వాళ్ళం. ఎక్కువ చదవడం వలన , చిన్న కవితలు రాయాలనిపించేది. అవి రాసాను.  అందులో మూడు రేడియో అన్నయ్యగారి ముందు బాలవినోదంలో చదవడం జరిగింది. అప్పుడు నా వయసు పధ్నాలుగు సంవత్సరాలు.

అభ్యుదయ రచయితుల రచనలు ముఖ్యంగా శ్రీ శ్రీ ని చదివి ఆ ప్రభావంతో చాలా కవితలు రాసాను. వాటిని నారాయణగూడా వైఎం సీఏ లో, సుల్తాన్ బజారులోని, కృష్ణ దేవరాయ భాషానిలయంలో, హిమాయత్ నగర్ లోని మఖ్దుం భవన్ లో,  బొగ్గులగుంట సారస్వత పరిషత్ లో చదవడం జరిగింది. .

             తరవాత వ్యాసాలు రాయడం మొదలు పెట్టాను. . మా వారి ఉద్యోగరిత్యా మేము పాతికేళ్ళకు పైగా సౌదీ             అరేబియా, మధ్యప్రదేశ్,  హిమాచల్ప్రదేశ్,  గుజరాత్,  ముంబాయి, తాత్కాలికంగా కొతకాలం ఢిల్లీ, ఇలా ఉత్తరాదిన వివిధ రాష్ట్రాలలో ఉన్నాము. అక్కడి యాత్రా స్థలాలు, పర్యాటక స్థలాలు, . ఎక్కువ, హిమాచల్ ప్రదేశ్ గురించి , రాయడం జరిగింది . అవే కాకుండాసామాజిక సమస్యల పైన కూడా ఎన్నో రాసాను.

నేను రాసిన మొట్ట మొదటి కథ , వ్యాసం రెండూ కూడా కాలేజీ మాగజైన్లో. ఆ తరవాత కవితలు,  మళ్ళీ కథలు. 1976 లోనేను రాసిన కాశీయాత్ర మొదటి కథ . అలా కథ,  కవిత,  వ్యాసం, ఏదో ఒకటి మేము ఏ ఊళ్ళో ఉంటే అక్కడినుంచి పత్రికలకి పంపించే దాన్ని, అవి ప్రచురించాకా మరోటి. . అంతే కానీ ఇప్పటిలాగా పంపించిన ఆ కథ ఏం అయిందో , తీసుకున్నారో లేదో అనే ఆలోచనకి  చోటు ఇవ్వకుండా రాస్తూ పోవడం అనేది జరిగేది కాదు.

. ఎంత సుదీర్ఘమీజీవితం, (92)ఉగాది కథల పోటీలో బహుమతి పొందింది. దేశమంటే మతాలోయ్. ఇందిరా గాంధి హత్య తరవాత జరిగిన ఒక సంఘటన  ఆధారంగా రాసిన కథ అది నాకు చాలా మంచి పేరు తెచ్చింది. ఎందుకంటే అంతవరకూ ఒక టైపు సాహిత్యం పత్రికల్లో ఉండడం నేను రాసిన కథ పూర్తిగా వేరే కోణంలోంచి రాయడం వలన కావచ్చు. వస్తువు కూడా కొత్తది దాని మూలంగా కూడా కావచ్చు. ఇంచు మించు ఇదే వస్తువు మీద బొంబాయి సినిమా వచ్చింది ( 92 ). నేను 87 ో రాసిన కథని  88  ఫిబ్రవరిలో ఆంధ్రభూమి వార పత్రికలో వచ్చింది. నా కథలో హిందూ అబ్బాయి,  సిక్అమ్మాయి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ పిల్లల్లో ఒకరిని సిక్ మతం, మరోకరిని హిందు మతం వ్రకారంగా పెంచుతారు. ఇందిరా గాంధి మరణానంతరం జరగిన అల్లర్లలో రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని ఈ కుటుంబం ముక్కలైపోతుంది. లేహ్ ప్రాంతానికి వెళ్తున్న బస్సులో వాళ్ళని దింపి ఖలిస్తాన్ వాళ్ళుకాలుస్తారు. , అందులో హిందూమత ప్రకారంగా పెరిగిన అబ్బాయిపోతాడు.  ఒకబ్బాయిని ఖలిస్థాన్ వాళ్ళు చంపితే, మరో అబ్బాయిని ఇందిరా గాంధి సెక్యూరిటీ గార్డు అయిన బేయాంత్ సింగ్ చంపాడని , అతని మీద కోపంతో కనపడ్డ సిక్కుల్ని చంపుతారు అందులో వీళ్ళబ్బాయి సిక్కు మత ప్రకారంగా పెరిగిన అబ్బాయి కూడా ఉంటాడు. ఇలా ఇద్దరి పిల్లలని పోగొట్టుకున్న కుటుంబం కథ, దేశమంటే మతాలోయ్ అన్నది.  నేను ఎక్కడో ఉండి రాసినా నా పేరు బాగా గుర్తు పెట్టుకున్నారు. అలాగే నేను రాసిన రాజధాని కబుర్లు (88) అనే కథ కూడా అంతే. అది ఢిల్లీ నేపథ్యంలో రాసిన కథఇందిరా గాంధి పోయాకా అనుమానాస్పథమైన వస్తువులని తీయకూడదు అంటూ రోజూ ఎన్నో ప్రకటనలు వచ్చేవి. ఇది తీసుకుని నేను రాసిన కథ రాజధాని కబుర్లు .  . ప్రముఖ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత , ఇంకా ఎన్నో పురస్కారాలు పొందిన శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు (2003/2004 )సుమారు పదహారేళ్ళ తరవాత కూడా ఆ కథని గుర్తుంచుకుని,  ఆవిడ నవ్య వార పత్రిక లోని తన కాలమ్ మాట సాయంలో  సందర్భంగా  ప్రస్థావించారు. . ఆ కథ ఎవరు రాసారో తెలీదు కానీ కథ గుర్తుందని ఆ కథని ఆవిడ పూర్తిగా రాసారు. అది చదివి వెంటనే,  నేను నవ్య ఆఫీసుకి ఫోన్ చేసి ఆవిడ నంబరు తీసుకుని మాట్లాడాను. ఆ కథ నేను రాసిందే అని చెప్పాను, . ఆ విధంగా ఓ గొప్ప రచయిత్రితో పరిచయ భాగ్యం కలిగింది. ఓ రచయిత్రిగా నేను ఇది ఓ గొప్ప అవార్డుగా భావిస్తాను.

ప్రముఖుల జీవితాలమీద ఎందరో మహానుభావులు పేర రాసిన వ్యాసాలు కూడా పుస్తకంగా వచ్చింది. ఓ పది హేనేళ్ళనుంచి ఆకాశవాణిలో క్రమం తప్పకుండా చర్చల్లో పాల్గొన్నాను.  స్వీయ కథనా పఠనం కూడా చేసాను.   ఇప్పటి వరకూ నేను 200 వరకూ కథలు రాసాను.  చాలా వాటికి బహుమతులు వచ్చాయి. పొట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం వారి ఉత్తమ రచన విభాగంలో సాహితీ పురస్కారం, మచిలీపట్నం ఆంధ్ర సారస్వత సమితీ వారి పురస్కారం, లేఖినీ మహిళా సాహిత్య, సాంస్కృతిక చైతన్య సంస్థ వారి పురస్కారాలు పొందాను. నే రాసిన కథల్లో,   160 కథలని 8 పుస్తకాలుగా తీసుకురావడం జరిగింది.

నేను రాసిన నవలలు అన్నీ కూడా నాకు మంచి పేరుని తెచ్చి పెట్టాయి. ముఖ్యంగా ఆఖరి ప్రయాణం, తప్పటడుగు, అనగనగా ఒకరోజు.  ఆ ఇద్దరు , అన్వేషణ (రెండో బహుమతి ) మొత్తం నవలలు పది అందులో 7 పుస్తకాలుగా వచ్చాయి. .

ఇది క్లుప్తంగా నా గురించి

  1. మీ సాహితీ ప్రస్తానం గురించి చాలా వివరముగా చెప్పారండి.  నిజంగా మీ రచనలు చాలా గొప్పగా ఉన్నాయి .  ఇందులో కొన్ని నేను  చదవలేదు .  మీరు చెప్పాక అవి కుడా చదవాలని అనిపిస్తోంది.  తప్పకుండా చదువుతాను.  ఇంకో ప్రశ్న అండి ,   ఈ మధ్య గత రెండు మూడు సంవత్సరాల నుంచి రచయిత్రులు బుక్ ఫేర్ లో ప్రమదాక్షరి పేరు తో తమ పుస్తకాలను అమ్మకానికి ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసుకొని ,  స్వయముగా అమ్ముకుంటున్నారు.  దీని గురించి మీ అభిప్రాయము ఏమిటి?

. ప్రమదాక్షరి స్టాల్ పెట్టాకా పాఠకులు రావడం కొనడం జరుగుతోంది. ఇది కొంచెం ఆశాజనకంగానే ఉంది.     పుస్తకాలు చదివే వాళ్ళున్నారు, అయితే ఇదివరకు అంత కాదు.

౩.  చివరగా ఈ మధ్య మీ  "ఆ ఇద్దరు " నవల చదివాను.  అందులో లో గరిమ లాంటి చదువుకొని ఉద్యోగము చేస్తూ స్వతంత్రముగా ఉన్న అమ్మాయి ,  పెళ్ళి తరువాత భర్త కు ఇంతకు ముందే వివాహమైంది అని తెలిసి ,  అతను పెట్టే ఇబ్బందులను అంతకాలము భరిస్తూ ఉండటము అవసరమంటారా ? అంటే ఇప్పటి యువతి కి ఎంత ఎదిగినా కష్టాలు తప్పవా?

ఆ ఇద్దరు అనే నవలలో గరిమ మాధవి ప్రధాన పాత్రలు. ఇద్దరూ చదువుకున్నవాళ్ళే. ఉద్యోగం చేసిన వాళ్ళే. కాని అంతకు ముందు వాళ్ళు తల్లులు. పదినెలలు మోసి కడుపు చించుకుని పుట్టిన పిల్లలని వదిలేయడానికి ఏ తల్లీ ఒప్పుకోదు.

ఇదే గరిమని భర్తనుంచి విడిపోక పోడానికి కారణం.

గరిమ కి తెలుసు , తన భర్త ఎటువంటి వాతావరణం నుంచి వచ్చాడో, అతని నేపథ్యం ఏంటో తెలుసు.  ఫ్యూడలిజం అతని  నరనరాల్లోఉంది.  ఆ ఇంట్లో ఆడవాళ్ళకి నోరు లేదు, అంతకన్నా నోరు లేకుండా చేసాడన్నది నిజం. అది ఆమె గ్రహించింది.  కొన్ని సందర్భాలలో భర్తని వదిలేయాలనుకుంది. కాని అది సాధ్యం కాలేదు. మాతృత్వం స్త్రీత్వం ఆమె కాళ్ళకి సంకెళ్ళు వేస్తాయి. . ఆమెకి తన పుట్టింటి సపోర్ట్ ఉండదనిపించింది. ఎందుకంటే వాళ్ళదృష్టిలో తన భర్త ఉత్తముడు. బాగా డబ్బున్న వాడు, ఎక్కువగా విదేశాలు తిరిగే ఉద్యోగం ఉన్నవాడు. పిల్లలంటే ప్రేమ ఉన్నవాడు. వాళ్ళకి ఖరీదైన  విద్యనిస్తాడు.  కాని వీటి వెనక కూతురు ఏం కోల్పోతోందో వాళ్ళకి తెలిసినా పట్టించుకోరు.

కాలం ఏదైనా,  ఏదేశం అయినా, ఆడవాళ్ళు ఎప్పుడూ బాధితులే. దీన్లో కులం, మతం లేదు. గొప్ప బీద లేదు. పల్లెటూరు పట్నం అని లేదు, చదువుకున్న వాళ్ళైనా, చదువు లేనివాళ్ళయినా . . . . . . సరే. . . ఆడవాళ్ళు ఎప్పుడూ విక్టింస్. మానం అభిమానం పోగొట్టుకుంటున్నవాళ్ళే. అయితే వీటన్నింటినీ తోసేసి అమ్మతనం ముందుకొస్తోంది. అందుకే భరించింది. విడాకులు తీసుకోకుండా భర్తకి దూరంగా ఉండాలంటే చదువు ఒక్కటే వరిష్కారం అనుకుంది.

అందుకే డొనేషన్ కట్టి, డాక్టరు అవాలని అనుకుంది.  చదువు పూర్తయ్యేసరికి   పిల్లలు పెద్దవాళ్ళవుతారు  వాళ్ళ చదువుల్లో, తను తన వృత్తిలో ఉండిపోవచ్చు. తల్లీ తండ్రీ విడిపోయారన్న అన్నబాధ ఉండదు. మానసికంగా వాళ్ళని ఆరోగ్యంగా పెంచాలంటే తను ఈ పని చేయక తప్పదు అని అనుకుంది.

అందుకే పిల్లలున్న జంటలు విడిపోయేముందు పిల్లగురించి ఆలోచించాలి. భార్యాభర్తలు విడిపోతే ఎవరికీ నష్టం లేదు. అమ్మా నాన్న విడిపోతేనే సమాజానికి నష్టం. దీని మీద నేను రాసిన మరో నవలే గ్రహణం .

నిజమేనండి మీరు చెప్పింది.  ఎ తల్లీ కూడా అంత తొందరగా తన పిల్లలకు తండ్రి లేకుండా చేయాలి అని అనుకోదు.  పిల్లల కోసం ,  ఎన్ని కష్టాలైనా భరించి ఇల్లాలిగా ఉండాలనే అనుకుంటుంది.  చాలా మంచి సందేశం అండి.

భానుమతి గారూ మీ విలువైన సమయాన్ని నా కోసం కేటాయించినందుకు ధన్యవాదాలండి.

ఇదండీ  గంటి భానుమతి గారి పరిచయము.  ఆ యిద్దరు నవల వెల 125 rs/ .  అన్ని ప్రముఖ పుస్తకాల షాప్ లల్లో దొరుకుతుంది.

 

మీ 

మాల కుమార్